తెలంగాణ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు: విజయశాంతి

  • తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల అడ్డగింత
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి
  • బెడ్ కన్ఫర్మ్ అయినా అనుమతించడంలేదని వ్యాఖ్యలు
  • రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొందని వెల్లడి
ఏపీ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాదు వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే ఆపేసి ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలు తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడంలేదని విజయశాంతి విమర్శించారు.

ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మ్ చేసుకున్నా, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయా? అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ దుస్థితికి కారకుడిగా భావించి తెలంగాణ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదని విజయశాంతి స్పష్టం చేశారు.

Vijayashanti
KCR
Telangana
Ambulances
Andhra Pradesh
Corona Virus

More Telugu News